నిజామాబాద్/జమ్మికుంట, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో దళితబంధు పథకం ఆగిపోవడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డిలో భారీ నిరసన చేపట్టాయి. రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులు నిజాంసాగర్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని రాజకీయ కోణంలో చూడటం, బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులను ఫ్రీజ్ చేయడం సబబు కాదని రేవంత్రెడ్డి సర్కారుకు హితవు పలికారు. ఒక్కో దళిత కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు. తొలి విడతలో మంజూరైన యూనిట్లకు డబ్బులు ఇవ్వడంతోపాటు రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలని వారు డిమాండ్ చేశారు.
రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలి
దళితబంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ పథకం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దండం పెడుతూ శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 14వ వార్డులో పలువురు లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయా ంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా దళితబంధు నిధులు అందించారని, ఇ ప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగించాలని కోరారు. మొదటి విడత నిధులు వచ్చి 18 నెలలు గడుస్తున్నదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే రెండో విడత నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.