(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): డాక్టర్ అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు స్వాగతించారు. అవార్డు ఇవ్వాలన్న తన సూచనపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తన సూచన కేసీఆర్ దృష్టికి వెళ్లడానికి సాయపడిన ‘నమస్తే తెలంగాణకు మనస్ఫూర్తిగా నమస్తే’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘నోబెల్, బుకర్ వంటి పురస్కారాలను గెలుచుకొని ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వ్యక్తులు కీర్తిని అర్జించారు. అంబేద్కర్ పేరిట సీఎం కేసీఆర్ ప్రకటించిన అవార్డును అందుకొనే వ్యక్తులు కూడా అదే స్థాయిలో కీర్తిని పొందుతారు. అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
పక్కా ప్రణాళిక ప్రకారం డబ్బును డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే వడ్డీ ద్వారా అవార్డును ఇస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన దూరదృష్టికి, అంకితభావానికి నిదర్శనం. అంబేద్కర్ పేరిట అవార్డును ప్రకటించడం ద్వారా.. బాబాసాహెబ్ ప్రపంచ స్థాయి మేధావుల్లో అగ్రస్థానంలోకి చేరారు. అంతపెద్ద మహాసభలో మా మితృత్వాన్ని గుర్తుంచుకొని, నన్ను మిత్రుడిగా సంబోధించిన కేసీఆర్కు కృతజ్ఞతలు. ‘నమస్తే’ పత్రికలో వచ్చిన వార్తను చూసి.. సీఎం అవార్డు నిర్ణయాన్ని తీసుకోవడమంటే, ఆ పత్రిక ప్రాధాన్యం, ప్రజల్లో దానికి ఉన్న విశ్వసనీయత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నా సూచనను సీఎం దృష్టికి తీసుకువెళ్లేలా చేసిన నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తికి, పత్రిక సిబ్బందికి ధన్యవాదాలు. నమస్తేకు మనస్ఫూర్తిగా మరోసారి నమస్తే’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు.