హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తీవ్ర కులవివక్ష ఆరోపణలకు వేదికైంది. రాష్ట్రంలో అత్యంత సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ను నిబంధనలకు విరుద్ధంగా వెనుక బెంచీకి పరిమితం చేసి అవమానించారంటూ రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో పెనుదుమారం రేగుతున్నది. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమీక్షకు డీజీపీ హాజరుకాలేదు. ఇలాంటి సమయంలో ప్రొటోకాల్ ప్రకారం డీజీపీ తర్వాతి హోదాలో ఉన్న అత్యున్నత స్థాయి పోలీస్ అధికారి, ముఖ్యమంత్రి పకనే లేదా ప్రధాన టేబుల్పై ముందువరుసలో కూర్చోవాలి. కానీ, ఆయన కంటే ఎంతో జూనియైర్లెన రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులతోపాటు, ప్రమోటీ ఐపీఎస్లను దర్జాగా ముందు సీట్లలో కూర్చోబెట్టి, 1995 బ్యాచ్ సీనియర్ దళిత అధికారిని వెనుక వరుసకు నెట్టివేశారు.
మాటల్లో రాజ్యాంగం.. చేతల్లో కుల పెత్తనం!
వినాయక చవితి ఏర్పాట్ల సమీక్ష కావడం వల్లే దళిత అధికారిని ముందువరుసలో కూర్చోబెట్టడానికి పాలకులు ఇష్టపడలేదని, కావాలనే దూరంగా ఉంచారని సోషల్ మీడియాలో, అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పండుగ నిర్వహణ పేరిట అత్యున్నత అధికారిపైనే వివక్ష ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శకులు మండిపడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా దళిత ప్రస్తావన తెచ్చి గందరగోళం సృష్టించడం, ఎమ్మెల్సీలపై సస్పెన్షన్లు, కేసులు బనాయించిన ప్రభుత్వం.. తీరా అధికారిక సమీక్షల్లోకి వచ్చేసరికి దళిత ఉన్నతాధికారులకు వెనుక బెంచీలు కేటాయిస్తూ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నదని దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సాక్షాత్తు శాంతిభద్రతల అధిపతిగా ఉన్న దళిత ఐపీఎస్ను కులం ప్రాతిపదికన అవమానించడం ప్రభుత్వ నైజాన్ని బయటపెట్టిందని మండిపడుతున్నాయి.