Congress | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోమారు వారిని దగా చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అనే కాంగ్రెస్ మార్కు కుటిల విధానాన్ని మరోమారు చాటుకుంది. అధికారమే లక్ష్యంగా హామీలు ఇవ్వడం తప్ప దళిత, గిరిజనుల అభ్యున్నతికి ఆచరణీయ విధానం ఒక్కటీ తమవద్ద లేదని చెప్పకనే చెప్పింది. చేవెళ్ల సభలో ఆ పార్టీ తాజాగా ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అందుకు అద్దం పడుతున్నది.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి వాటి పేర్లు మార్చడం తప్ప అందులో కొత్తగా మరేమీ లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు దళితబంధు సాయాన్ని రూ. 12 లక్షలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ డిక్లరేషన్పై దళిత మేధావులు పెదవి విరుస్తున్నారు. దగాకోరు డిక్లరేషన్ అని మండిపడుతున్నారు.
ఎస్సీల రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 18 శాతానికి పెంచుతాం. రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకుంటాం
వాస్తవం: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 20 శాతం పెరిగింది. ఆ మేరకు రిజర్వేషన్లు కూడా పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. అలాగే, ఎస్టీల రిజర్వేషన్ను 6 నుంచి 10 శాతానికి పెంచింది. అయినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఎస్సీల రిజర్వేషన్ను 18 శాతానికి మాత్రమే పరిమితం చేయడం దాని అవగాహన రాహిత్యం, అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం.
ఎస్సీ వర్గీకరణ అంశంలో వాస్తవం: ఎస్సీలను ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అంశం దశాబ్దాలుగా పెండింగ్లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన పలువురు నేతలు దీనిని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో 2004 నుంచి ఈ అంశం పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పటి డిక్లరేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పలేదు. అమలు కోసం చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రకటించింది.
దళితుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ యథాతథంగా కాపీకొట్టి దానిని అంబేద్కర్ అభయహస్తంగా పేరు మార్చి మరో రూ. 2 లక్షలు పెంచి రూ. 12 లక్షలు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంతమందికి ఇస్తామన్న విషయాన్ని ప్రకటించలేదు.
వాస్తవం: ఒక్క తెలంగాణలో తప్ప కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు సహా దేశంలో మరెక్కడా దళితబంధు పథకం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో దళిత యువత ఉపాధి కోసం ఐరావత పథకం కింద ట్రాన్స్పోర్ట్, ప్యాసింజర్ వాహనాల కోసం 3 శాతం వడ్డీరేటుతో రుణాలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. అదికూడా ఏడాదికి 25 వేల మందికి మాత్రమే పరిమితం చేసింది. తెలంగాణలో మాత్రం రూ.12లక్షలు ఇస్తామని ప్రకటించి ద్వంద్వ నీతిని చాటుకుంది.
ఇండ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇంటిస్థలం పాటు, నిర్మాణానికి రూ.6లక్షలను అందిస్తామని ప్రకటించడం కూడా కాంగ్రెస్ ద్వంద్వనీతికి అద్దం పడుతున్నది. ఇస్తామన్న రూ.6 లక్షలను రుణంగా ఇస్తారా? లేదంటే, 100 శాతం సబ్సిడీతోనా అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. కర్ణాటకలో అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఐదేళ్లలో ప్రభుత్వపరంగానే ఇంటిని నిర్మిస్తామని వాగ్దానం చేసింది.
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరుపేదలకు ఇండ్ల స్థలాలను ఇవ్వాలని నిర్ణయించింది. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. రూ.5లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేస్తున్నది.
ఎస్సీల్లో మాల, మాదిగ, ఇతర ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్కు రూ.750 కోట్లు నిధులు మంజూరు చేస్తామని, 3 ఎస్టీ కార్పొరేషన్లు.. తుకారాం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడా, ఎరుకుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.500 కోట్ల నిధుల మంజూరు చేస్తామని డిక్లరేషన్లో పేర్కొన్నది.
వాస్తవం: కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీల్లో జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలతోపాటు, 12 బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటుచేసింది. అదే విధానాన్ని కాపీ కొట్టి ఎస్సీ, ఎస్టీల్లో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే రూ. 5 లక్షలు అందజేస్తాం.
వాస్తవం: ఈ పథకం కూడా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేదు. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రకటించింది. అయితే 1-5 వరకు నెలకు రూ.150, 6-10 వరకు నెలకు రూ.300 ప్రోత్సహకాన్ని మాత్రమే అందిస్తామని ప్రకటించింది.
ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్మెంట్, డిగ్రీ, పీజీ విద్యార్థుల హాస్టల్ వసతి కల్పన. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థికసాయం అందజేత.
వాస్తవం: రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉన్న 105 ఎస్సీ గురుకులాలను ప్రభుత్వం 298కి పెంచింది. వాటిలో ప్రత్యేకంగా న్యాయ కళాశాలలు, ఆర్మ్ ఫోర్సెస్, సైనిక్ కళాశాలను డిగ్రీ వరకు నెలకొల్పింది. ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తుండడంతోపాటు పీజీ, డిగ్రీ విద్యార్థుల కోసం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రం అందివ్వని రీతిలో ఇటీవల 26 శాతం డైట్ చార్జీలను కూడా పెంచింది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాల్లో ఎస్సీ, ఎస్టీలు చదువుకునేందుకు రూ.20లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. అయినా కాంగ్రెస్ తామేదో కొత్తగా చేస్తున్నట్లు డిక్లరేషన్లో ప్రకటించడం వింతగా ఉంది. విదేశీ సాయాన్ని ఎంత మేరకు అందిస్తామనేది కాంగ్రెస్ ప్రకటించలేదు.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
వాస్తవం: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, వివిధ డీలర్షిప్లు, మెడికల్, ఫర్టిలైజర్ ఏజెన్సీ బాధ్యతలు, మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. కాంగ్రెస్ ఈ అంశాన్ని కొత్తగా డిక్లరేషన్లో చేర్చడమే విడ్డూరం. ఎస్సీ, ఎస్టీలు కంపెనీలు స్థాపించేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సహిస్తున్నది. టీఎస్ ప్రైడ్ ద్వారా రాయితీలను అందిస్తుండగా, కాంగ్రెస్ మాత్రమే కంపెనీల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం దళిత, గిరిజనుల అభ్యున్నతిపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుతున్నది.
పైన పేర్కొన్న పథకాలే కాదు అసైన్డ్ భూముల పునరుద్ధరణ, పోడు పట్టాల పంపిణీ, సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం, కొత్త ఐటీడీఏలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు.. మొత్తంగా దళిత డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి పథకమూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కాపీనే. ఇప్పటికే అమలవుతున్న పథకాల పేర్లను మార్చింది తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. పోడు పట్టాలను ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసింది. తండాలు, గూడేలను పంచాయతీలుగా గుర్తించి నిధులు కేటాయిస్తున్నది. సబ్ ప్లాన్ నిధులతో పెద్దమొత్తంలో నిధులను వెచ్చిస్తూ మౌలిక వసతులను కల్పిస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్పై దళిత మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ను కడిగిపారేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని వారు ఇక్కడెలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తొలుత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని హితవు పలుకుతున్నారు. అన్నభాగ్య పథకం కోసం ఇటీవల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులనే మళ్లించాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఉదహరిస్తున్నారు.
‘ఇదేం ప్రసంగం బాబోయ్.. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు’.. ఇదీ శనివారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభకు హాజరైన సభికుల అభిప్రాయం. ముఖ్య అతిథి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగాన్ని సభికులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఈసడించుకుంటున్నారు. ఆయన ఏం చెబుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో అర్థంకాక సభికులు బిక్కమొహం వేశారు. ఆయన ప్రసంగానికి కనీస స్పందన కూడా కరువైంది. ఖర్గే ప్రసంగంపై ఆయన సొంత పార్టీ కీలక నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన ప్రసంగంతో సభ అట్టర్ఫ్లాప్ అయిందని, తమ కష్టం వృథా అయిపోయిందని వాపోయారని సమాచారం. ఇప్పుడే ఎవరూ వెళ్లిపోవద్దని, అందరి ప్రసంగాలు పూర్తయ్యే వరకు ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కోరడం గమనార్హం.