కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/చింతలమానేపల్లి, ఏప్రిల్ 5 : తన పట్టా భూమిలో ట్రెంచ్లు తవ్వుతుండటంతో ఆందోళన చెందిన ఓ దళిత రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గంగాపూర్ బీట్లో సర్వే నంబర్ 91/441 లో గల నాలుగెకరాల పట్టా భూమిని దళిత రైతు దుర్గం రాజేశ్వర్ సాగు చేసుకుంటున్నాడు. ఫారెస్ట్ అధికారులు అటవీ భూములకు హద్దులు ఏర్పాటు చేసే క్రమంలో జేసీబీతో ట్రెంచ్లు తవ్వుతున్నారు. రైతు దుర్గం రాజేశ్వర్ చేను పక్కన ఉన్న ఇతర రైతు భూముల్లో ట్రంచ్లు తవ్విన అధికారులు, ఆదివారం నుంచి ఇతడి భూమిలో ట్రెంచ్లు తవ్వేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న దుర్గం రాజేశ్వర్ శనివారం అటవీ అధికారులను కలిసి తన పట్టా భూముల్లో ట్రెంచ్ తవ్వొద్దని బతిమిలాడాడు. ఆ మాటలను పట్టించుకోని అధికారులు ఆదివారం దుర్గం రాజేశ్వర్ చేను వద్ద జేసీబీ ద్వారా ట్రెంచ్లు తవ్వేందుకు యత్నించారు. దీంతో మనస్తాపం చెందిన రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఎస్ఐ జీవన్ అతడిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని దవాఖానకు తరలించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో సుభాష్ను ఫోన్లో వివరణ కోరగా, బాబాపూర్ బీట్లో 900 హెక్టార్లకుపైగా ఫారెస్ట్ భూమి ఎంక్రోచ్మెంట్ జరిగిందని, అందులో 50 హెక్టార్ల చుట్టూ ఉన్న పాత ట్రెంచ్ను తవ్వుతుతున్న క్రమంలో రైతు పురుగులమందు తాగినట్టు తెలిసిందని పేర్కొన్నారు.