హుజూరాబాద్ : కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములవ్వాలనే సంకల్పంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ నాయకులు దళిత బంధు ఆపాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన దళిత బంధు పథకం అమలు ఆగదు అని తేల్చిచెప్పారు. దేశంలోనే ఒక గొప్ప పథకంగా దళితబంధు పథకం చరిత్రలో నిలవబోతుంది అని పేర్కొన్నారు. దళితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు అందుతుందని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధివిధానాలు నచ్చకనే ఈ రోజు ఆయా పార్టీలను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వచ్చే ప్రతి ఒక్కరిని స్వాగతిస్తామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సామాన్య కుటుంబాల జీవనం ఎంతో భారంగా మారింది. నిత్యావసర ధరలు,గ్యాస్,చమురు ధరలు ఆకాశాన్నంటాయి. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఒక్క రూపాయి పని కూడా చేయలేదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ప్రజల కష్టాల పట్టని బీజేపీ నాయకులు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారు అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
దేశరాజుపల్లి ఉపసర్పంచ్ మెట్టుపల్లి సుభాష్, వార్డు మెంబర్లు నాగుర్ల వెంకటేష్, పాత భార్గవ్, దాసరి శ్రీనివాస్, సురావు రాజేష్, ఎండి హకీమ్, మర్రిపెల్లి రాజేష్, సురావు సాంబయ్య, రాజులు, సముద్రాల సాయిలు, శ్రీనివాస్, ఒగ్గోజు మొగిలి, సముద్రాల శ్రీనివాస్, సముద్రాల చంద్రమౌళిలతో పాటు 100 మందికి పైగా చేరారు.