హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలిపారు. ఈ పథకం అంబేద్కర్ ఐడియాలజీని ఆచరణలో పెట్టనున్నదని చెప్పారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఏపీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం రాబోయే రోజుల్లో నూతన సామాజిక, ఆర్థిక పరిణామాలను సృష్టిస్తుందన్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా 10 లక్షల ఆర్థిక సాయం అందజేయడం మామూలు విషయం కాదన్నారు.
ఈ మొత్తంతో దళితులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఆకాంక్షించారు. కొనుగోలుదారులుగా ఉన్న దళితులు ఉత్పత్తిదారులుగా మారుతారని, స్వ యం ఉపాధి పొందడంతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తారని చెప్పా రు. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించ డం వల్ల అస్పృశ్యత తొలగిపోతుందని చెప్పారు. దళితులు పారిశ్రామికవేత్తలు గా ఎదిగి పన్ను చెల్లింపుదారులు అవుతారని, తద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని వివరించారు. పథకంపై దేశవ్యాప్తంగా దళిత మహాసభ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామ ని.. సెమినార్లు, సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంత గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతూ ఏపీలో కూడా దళితబంధు అమలు చేయాలని పద్మారావు ఈ సందర్భంగా సీఎం జగన్ను కోరారు.