ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల అంశానికి న్యాయం చేసేలా ముందుకు పోతున్నాం. ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలతో.. ‘మంచం పట్టిన మన్యం’ అంటూ వచ్చే వార్తలు ఈ రోజు చెత్తబుట్టలో పడ్డాయి. త్వరలోనే అన్ని తండాలు, గూడేలకు త్రీఫేజ్ కరెంటు సరఫరా అవుతుంది.
– మంత్రి కేటీఆర్
KTR | రాజన్న సిరిసిల్ల, జూలై 6 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్.. ఆదివాసీ, గిరిజనుల గుండె చప్పుడు.. ఆత్మబంధువు అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ, గిరిజనులకు భూమి పట్టాలు అందించి వారి చిరకాల కోరికను నెరవేర్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1.51 లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులకు 4 లక్షల ఎకరాల భూమికి ఏక కాలంలో హక్కు పత్రాలు అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణే అని స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే పోడు పట్టాల పంపిణీ సువర్ణాధ్యాయమని, ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించలేదని పేర్కొన్నారు. గురువారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పర్యటించారు. జిల్లెల్ల గ్రామంలోని వ్యవసాయ కళాశాలలో మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రాం విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో 124 మంది వీధి వ్యాపారులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం కింద చెక్కులను అందజేశారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారులు కొనుగోలు చేసిన పల్లె వెలుగు బస్సును ప్రారంభించారు. పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లాలోని 1,614 మంది పోడు రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏండ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలు, గిరిజనుల కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసిందని చెప్పారు.
‘దళిత సమాజంలో పరివర్తన తేవాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దళితులను ధనికులను చేయాలన్న సంకల్పంతో దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ సాహోసోపేత నిర్ణయం సత్ఫలితాలను ఇస్తున్నది. దళితబంధు పథకం ఫలితాలు అందుతుంటే చాలా సంతోషం కలుగుతున్నది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండో విడతలో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున దళితబంధు యూనిట్లు ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 3,416 తం డాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసి, 3 వేల మందిని సర్పంచ్, 30 వేల మంది గిరిజనులను వార్డు మెంబర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. గిరిజనులకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లు పది శాతానికి పెంచి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. జల్, జంగల్, జమీన్ అన్న కుమ్రం భీంను స్ఫూర్తిగా తీసుకుని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రైతుబంధు పథకం ద్వారా 60 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లను పంట పెట్టుబడి సాయం కింద జమచేసినట్టు తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మరోవైపు చదువుకున్న పిల్లలకు కొలువులొచ్చేలా ప్రైవేటు రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ‘జిల్లెల్ల వ్యవసాయ కళాశాల కన్నా గొప్ప కాలేజీ దేశంలోనే లేదని స్పష్టం చేశారు.
అటవీ భూములకు పట్టాలందించడం సాహసోపేత నిర్ణయమని, సీఎం కేసీఆర్ దృఢమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలని కోరారు. దళితబంధు పథకం ద్వారా దళిత బిడ్డలు ధనికులయ్యారని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందికి దళిత బంధు కింద యూనిట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిలో 98 శాతం యూనిట్లు సక్సెస్ అయ్యాయని, ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. కార్యక్రమాల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం స్పందించారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల కోసం ఆరాట పడుతుంటే.. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. హెల్త్కేర్, మెడికల్ ఎడ్యుకేషన్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలకడం ద్వారా తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలలు, 500 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటవుతున్నట్టు చెప్పారు. ఇది స్వతంత్ర భారతదేశంలో ఒక అపూర్వమైన ఘనత అని పేర్కొన్నారు. మన రాష్ర్టానికి దరిదాపుల్లో మరే రాష్ట్రమైనా ఉందా? అని ప్రశ్నించారు.