కరీంనగర్ కలెక్టరేట్/ కార్పొరేషన్, జనవరి 31: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల ఎదుగుదలను వివరిస్తూ సక్సెస్ స్టోరీలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. పథకంతో దళితుల జీవితాల్లో వచ్చిన మార్పులతో డాక్యుమెంటరీలు రూపొందించాలని, ఇవి దేశానికి దిక్సూచిగా నిలిచేలా ఉండాలని చెప్పారు.
సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చే లాల్బహుదూర్శాస్త్రి అకాడమీలో కూడా ఈ పథకం విజయవంతంగా అమలవుతున్న తీరుపై ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి రానున్న ఆగస్టు 16 నాటికి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దళితబంధు లబ్ధిదారులతో కరీంనగర్లో మహాసమ్మేళనం నిర్వహిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు.