Dalith Bandhu | హైదరాబాద్/ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దళితుల ఉద్ధరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో అర్హులైన అందరికీ దళితబంధు అందిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 162 మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వాహనాల ప్రొసీడింగ్స్ను అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గాంధీజీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఢిల్లీలో స్వచ్ఛభారత్ ఫొటోలకు పోజులు తప్ప ప్రధాని మోదీ ఆచరించడం లేదని మండిపడ్డారు.
మూడుసార్లు వేతనాల పెంపు
దేశంలో ఎవరూ చెప్పని విధంగా సఫాయి అన్న నీకు సలాం అని సీఎం కేసీఆర్ చెప్పారని, జీహెచ్ఎంసీ కార్మికులకు మూడుసార్లు జీతాలు పెంచారని మంత్రి కేటీఆర్ చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచేందుకు వాహనాలు ఉండాలనే సిల్ట్ వాహనాలను తీసుకొచ్చామని చెప్పారు. ఒక్కో వాహనంపై నెలకు రూ.1.20 లక్షల లాభం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు గోపీనాథ్, గోపాల్, వెంకటేశ్, నాగేందర్, ప్రకాశ్గౌడ్, సుభాష్రెడ్డి, ఆనంద్, విఠల్రెడ్డి, పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్ తదితరులు పాల్గొన్నారు.
‘సఫాయిమిత్ర’ ప్రారంభం
గాంధీ జయంతి సందర్భంగా ‘సఫాయిమిత్ర’ కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలో ప్రారంభించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ‘సఫాయి అమ్మా.. సలాం అమ్మా, సఫాయి అన్నా.. సలాం అన్నా’ అనే పిలుపును స్ఫూర్తిగా తీసుకొని పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు పమేలా సత్పతి తెలిపారు. రాష్ట్రంలోని 141 పట్టణ స్థానిక సంస్థల్లో మెడికల్ క్యాంపులను నిర్వహించడంతోపాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హెల్త్ రికార్డ్ బుక్స్ను అందించామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్శాఖ అదనపు డైరెక్టర్లు, సంయుక్త డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
దళితబంధు రెండోవిడత ఎంపిక జాబితాలు రెడీ
దళితబంధు రెండో విడత కోసం 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 కుటుంబాల చొప్పున, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలకు కలిపి 1,30,000 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలో 45 నియోజకవర్గాల నుంచి నిర్ణీత సంఖ్యలో దళితబంధు ఎంపిక జాబితాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం ఇటీవలే మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం, సత్తుపల్లి నియోజకవర్గంలోని మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.