హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పుట్టుకతో కొందరు.. వివిధ ప్రమాదాల్లో క్షతగాత్రులై మరికొందరు దీర్ఘకాలంగా అంగవైకల్యంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఒంట్లో శక్తి ఉన్నా పనిచేసేందుకు అవయవాలు లేక మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకొంటూ బతుకుబండి లాగిస్తున్నారు. నచ్చిన రంగంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు పథకం కింద ఎలాంటి షరతులు, బ్యాంకు లింకేజీలు లేకుండా ఏక మొత్తంగా రూ.10 లక్షలు అందజేస్తుండటంతో వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం కింద తొలివిడతలో గుర్తించిన అర్హులు 38,640 మందికాగా, అందులో దళిత దివ్యాంగులు 327 మంది ఉండటం విశేషం.
అర్బన్ ఏరియాలోనే ఫోర్వీలర్లు
నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్లో 11 మంది, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెంలో 9 మంది, జగిత్యాలలో 8, నిర్మల్లో 7, సిద్దిపేట, మంచిర్యాల, వికారాబాద్, మహబూబాబాద్లలో ఆరుగురు, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నారాయణపేట, ములుగు, మెదక్, జోగులాంబ, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 4 గురు చొప్పున, కరీంనగర్, జనగామ, మహబూబ్నగర్లో ముగ్గురు చొప్పున, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డిలో ఒక్కరు లబ్ధి పొందారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎక్కువగా ట్రాక్టర్లను ఎంచుకోగా, అర్బన్ ఏరియాలో ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు, డీటీపీతోపాటు, నిర్మాణ సామగ్రి యూనిట్లను ఏర్పాటు చేసుకొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డెయిరీ, మినీ సూపర్బజార్తోపాటు ఇతర వ్యాపారాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను ఎంపిక చేసుకొన్నారు.
కేసీఆర్ సార్ ఆదుకొన్నడు..
మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట. ఇద్దరు ఆడపిల్లలు. భర్త నర్సయ్య(60)కు కాళ్లు, చేతులు పనిచేయవు. సరిగా నడలేడు, కూసోలేడు. ఒక్కదాన్ని కూలీ పనులు చేసుకొంటూ, ఆయనకు వచ్చే ఆసరా పింఛన్తోనే కుటుంబాన్ని ఎల్లదీస్కుంట వచ్చిన. చేతకావడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్ముల ఆదుకున్నోళ్లు ఎవలూ లేరు. కేసీఆర్ సర్కారే మాకు అన్నింట్ల ఆసరైతంది. బిడ్డ పెండ్లికి పైసలిచ్చిండు. ఇప్పుడు దేవునోలె సారే మళ్లా దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చిండు. ఆ పైసలతోనే ఊర్ల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి మినీ సూపర్మార్కెట్ పెట్టుకొన్న. గిరాకీ మంచిగ వత్తంది. కేసీఆర్ సారే మా ఇల్లు నిలుపిండు.
-చిట్యాల నర్సు
దళితబంధు దారి చూపింది
మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు. గుంట భూమి లేదు. చిన్నతనం నుంచి కూలీనాలి చేసుకొంటూ బతుకుతున్నా. అక్క మానసిక వికలాంగురాలు. అందరం కలిసి కూలీకి పోతేనే పూట గడిసేది. కేసీఆర్ సారే మాకు దారిచూపిండు. ఎమ్మెల్యే దివాకర్రావు సార్ మా అక్కకు దళితబంధు మంజూరు చేసిండు. ఆ పైసలతోని 100 మేకలను కొని షెడ్ వేసిన. మేకలతో పాటు వాటికి కావాల్సిన మందులు, దాణా కూడా ఇస్తమన్నారు. డాక్టర్లు వచ్చి అన్ని చెప్తున్నరు.
-చొప్పదండి కృష్ణ (సుజన తమ్ముడు)
నా బతుకును మార్చింది..
మాది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం. చిన్నతనంలో ఆడుకొంటూ ఇంటి పైనుంచి కిందపడటంతో కాలు విరిగింది. అతికష్టం మీద ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకొంటున్నా ఆదాయం అంతంతే. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. కరీంనగర్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉచిత వీడియోగ్రఫీలో శిక్షణ తీసుకొన్నా. ఊర్లోనే చెన్నకేశవ డిజిటల్ స్టూడియో పెట్టుకొన్నా. కొత్తలో బాగానే ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రీవెడ్డింగ్ తదితర వీడియో షూట్లపై ఆసక్తి చూపుతుండటంతో చిన్న కెమెరాలతో తీయడం సాధ్యంగాక ఉపాధి పూర్తిగా తగ్గిపోయింది. హైక్వాలిటీ కెమెరాలు కొందామంటే పెట్టుబడి లేకుండె. దళితబంధు పథకంతో కష్టాలన్నీ తీరిపోయినయి. మొదటివిడత ఇచ్చిన రూ.5 లక్షలతో రెండు హైక్వాలిటీ కెమెరాలు, ఇతర పరికరాలు కొన్నా. మరో రూ.5 లక్షలతో కంప్యూటర్ సిస్టం, ప్రింటర్, ఇతర సామగ్రి, జిరాక్స్ మెషిన్ పరికరాలు తెచ్చుకొంటా. దళితబంధుతో మా కుటుంబ పరిస్థితి మారిపోయింది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
-కొమ్ము సంపత్
నేడు దివ్యాంగుల అవేర్నెస్ వాక్
హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): ఈ నెల 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల అవేర్నెస్ వాక్ను శుక్రవారం నిర్వహించనున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ తెలిపారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి పీవీ మార్గ్ వరకు అవేర్నెస్ వాక్ కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.
దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి
దళితబంధు పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. లాభదాయకమైన, ఇష్టమైన వృత్తిని యూనిట్గా ఎంచుకోవాలి. ప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షలను సద్వినియోగం చేసుకొంటూ స్వశక్తితో ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలి.
-కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి
కేసీఆర్తోనే దివ్యాంగుల సంక్షేమం
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధం గా కేసీఆర్ దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా రూ.3వేల పింఛన్ అందిసున్నారు. ఇప్పు డు దళితబంధు ద్వారా దళిత దివ్యాంగులకు ఎంతో లబ్ధి చేకూరుతున్నది. దివ్యాంగుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కే వాసుదేవరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్