కరీంనగర్, జనవరి 25 : దళితబంధు పథకం కింద 32 వేల ఎస్సీ కుటుంబాలకు మొదటి విడుతలో లబ్ధి కల్పించేందుకు సీఎం కే చంద్రశేఖర్రావు ముందుకెళ్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అందుకోసం రూ.3,449 పైచిలుకు కోట్లు అవసరమని తెలిపారు. డబ్బులు ఎంతైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 30 ఏండ్ల కిందట కేసీఆర్ ఎమ్మెల్యేగా అమలు చేసిన దళిత జ్యోతి పథకమే నేటి దళితబంధు పథకం అమలుకు స్ఫూర్తి అన్న మంత్రి.. యావత్తు దళిత సమాజం తలెత్తుకొని తిరిగేలా చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దళితబంధు పథకం అమలు, కొత్త నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ వంటి అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు.
దళితబంధు పథకాన్ని కొత్తగా ఎన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెడుతున్నారు?
గతేడాది ఆగస్టు 16న కేసీఆర్ ఈ పథకాన్ని హుజూరాబాద్లో ప్రారంభించారు. తర్వాత వాసాలమర్రి, ఆ తదుపరి నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని ఎంపిక చేసిన ఒక్కో మండలంలో ప్రారంభమైంది. ఇక్కడ దళితబంధు కమిటీల ఏర్పాటు ప్రక్రియ సాగుతున్నది. కొత్తగా 118 నియోజకవర్గాల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అమలుకు చర్యలు తీసుకొంటున్నాం.
రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఎంపికవుతారు?
32 వేల మంది దళిత బిడ్డలకు ఈ ఆర్థిక సంవత్సరంలో లబ్ధి కలుగనున్నది. హుజూరాబాద్లో ఇప్పటికే 17,554 మంది ఎంపికయ్యారు. వాసాలమర్రిలో 72 కుటుంబాలు. వీటితో పాటు మధిర, జుక్కల్, తుంగతుర్తి, అచ్చంపేట పరిధిలో 2,500, కొత్తగా 118 నియోజకవర్గాలకు వంద చొప్పున చూస్తే 11,800లు మొత్తం కలిపి 31,926 మంది ఎంపికవుతారు.
కొత్త నియోజకవర్గాల్లో ఎంపికకు ప్రాతిపదిక?
బీపీఎల్ కుటుంబాలు,అందులోనూ అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలనుంచి ఎంపిక ఉంటుంది. గోల్మాల్కు తావులేకుండా పరిశీలనకు ప్రత్యేక మెకానిజం పనిచేస్తుంది. వచ్చే మార్చి 7లోగా కొత్త నియోజకవర్గాల్లో ఎంపిక పూర్తిచేసి, లబ్ధిదారుల జాబితాను వెల్లడిస్తాం.
కొత్త నియోజకవర్గాల్లో వంద మందిని మొత్తం నియోజకవర్గాన్ని తీసుకొని ఎంపికచేస్తారా? లేక దానిలో కొన్ని గ్రామాలనే తీసుకుంటారా?
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కలిసి నిర్ణయం తీసుకొంటారు. అత్యంత పేదలకు ఎలా న్యాయం జరుగుతుందో.. ఆ ప్రకారం ముందుకు వెళ్తాం.
హుజూరాబాద్, వాసాలమర్రి ప్రాంతాల్లో దళిత బంధు ప్రగతి ఏమిటి?
హుజూరాబాద్లో 17,554 మంది లబ్ధిదారులకు రూ.1737.85 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటివరకు 947 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. మిగిలిన వాటి గ్రౌండింగ్కు చర్యలు తీసుకొంటున్నాం. వాసాలమర్రిలో 72 మందికి 57 యూనిట్లు గ్రౌడ్ ఆయ్యాయి. మరో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి రూ.250 కోట్లు మంజూరయ్యాయి.
పథకం అమలుకు ఎంత డబ్బు అవసరం? అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమా?
ఎట్టి పరిస్థితుల్లో పథకం అమలుచేసి తీరాలన్న సంకల్పంతో సీఎం ఉన్నారు. ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం. పథకం అమలుకు తొలి విడుతలో రూ.3,449.40 కోట్లు అవసరం. ఇప్పటికే 2,257.60 కోట్లు విడుదలచేసింది. మరో రూ.1191.80 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నది.
పథకం అమలులో ఏమైనా అనుమానాలుంటే ఎవరిని సంప్రదించాలి?
జిల్లా స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీని, జిల్లా కలెక్టర్ను, రాష్ట స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులను కలసి నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా మంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తాం.
క్షేత్రస్థాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపవచ్చా?
పథకం కింద 50కి పైగా ప్రాజెక్టులను ఎంపిక చేశాం. ఇవేకాదు, కోరుకున్న రంగంలో లబ్ధి కల్పించడానికీ చూస్తున్నాం. ఆయా జిల్లాల కలెక్టర్లు, లేదా ఇతర ఉన్నాతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా యూనిట్లను ప్రతిపాదించడానికి వెసులుబాటు కల్పించాం. అంతిమంగా లబ్ధిదారుడు అర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం.
పథకంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉండబోతున్నది? ఎటువంటి ఫలితాలుంటాయని ప్రభుత్వం నమ్ముతున్నది?
లబ్ధిదారుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎలాంటి సహాయమైనా అందిస్తాం. లబ్ధిదారుడికి ‘చిప్ ఎనేబుల్డ్ స్మార్ట్ కార్డ్’ ఇస్తున్నాం. ఇది కుటుంబం చేపట్టే కార్యాచరణ పురోగతికి సంబంధించిన డైనమిక్ డాటాతోపాటు లబ్ధిదారుని కుటుంబం మొత్తం డాటాను క్యాప్చర్ చేస్తుంది. లబ్ధిదారుడి వివిధ స్థాయిల్లోని పురోగతిని పర్యవేక్షించడానికి అధికారులకు సహాయకారిగా ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలపై ఉన్న తీవ్ర వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది. ఈ వివక్షకు మొత్తం నాగరిక సమాజం సిగ్గుపడాలి. దళితబంధు కార్యక్రమం ఒక పరివర్తనను తెచ్చే నిప్పురవ్వ లాగా సమాజాన్ని రగిలిస్తుందని దృఢంగా తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా చేపడతాం. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు.
ఈ పథకం మన రాష్ట్రంలో చేపట్టేందుకు కారణం ఏమిటి? స్ఫూర్తి ఎక్కడిది?
మన దేశంలో అత్యంత అణగారిన వర్గాలు ఎస్సీ కులాలే. వారి వెనుకబాటుతనం ఆర్థికపరమైనది మాత్రమే కాదు.. సామాజికమైనది కూడా. శతాబ్దాలుగా ఈ వర్గాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి ఎస్సీల ఆర్థికాభివృద్ధికి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ‘దళిత బంధు’ పథకానికి రూపకల్పన చేశారు. ఇటువంటి మహత్తరమైన పథకం తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. నిజానికి సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అంటే దాదాపు 30 ఏండ్ల కిందటే దళిత జ్యోతి పథకాన్ని ప్రారంభించి అమలుచేసిన ఘనత కేసీఆర్ది. ఎస్సీ కుటుంబాలను సమాజంలో తలెత్తుకొని తిరిగేలా చేయాలన్న విజన్కు అనుగుణంగా ప్రభుత్వం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ను 2021-22 బడ్జెట్లో వెయ్యి కోట్లతో పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎస్సీ ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రముఖులతో పలుమార్లు సంప్రదించి, మేధోమథనం చేసిన తర్వాతే దళితబంధు బయటకు వచ్చింది.