సూర్యాపేట : దళితబంధు పథకం మరో విప్లవం సృష్టించబోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి అద్భుతమైన పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టింది 1985 లోనేనని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని తిరుమలగిరి పురపాలక సంఘం భవనంలో జరిగిన దళితబంధు పై అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సామాజిక అంతరాలను తొలగించి దళితులను ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలు సాకారం చేయడమే సీఎం లక్ష్యమన్నారు. ఎన్నికల కోసమో..ఎన్నికల్లో లబ్ధి పొందేందుకో ఉద్దేశించబడినది ఎంతమాత్రం కాదన్నారు.
స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గ్యాదరి కిశోర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ హేమంత్ పటేల్తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజని, వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ యన్. స్నేహలత, జడ్పీటీసీ అంజలి పాల్గొన్నారు.