కరీంనగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)/జమ్మికుంట/వీణవంక: దళితబంధు రెండో విడత నిధులు రావడం లేదని లబ్ధిదారులు మనస్తాపం చెందుతూ ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. ఇక దళితబంధు నిధులు ఇవ్వరేమోనన్న నిరాశతో కరీంనగర్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు లబ్ధిదారు లు బలవన్మరణానికి సిద్ధపడ్డారు. వారం రో జుల కింద ఒకరు.. ఆదివారం మరొకరు ఆత్మహత్యాయత్నం చేశారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన గాజుల అమల-ప్రవీణ్ దళితబంధు పథకం కింద స్థానికంగా ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. మొదటగా రూ.5 లక్షలు మంజూరు కాగా కెమెరాలు తెచ్చుకున్నారు. మిగతా రూ.5 లక్షలు వస్తాయన్న ఆశతో అమల తన బంధువుల దగ్గర రూ.3 లక్షలు అప్పుచేసి లెన్స్, పెద్ద కెమెరా తదితర సామగ్రి కొనుగోలు చేసింది. అయితే.. పెండింగ్లో ఉన్న దళితబంధు నిధులను ప్రభుత్వం ఇవ్వకపోవడం, అప్పు ఇచ్చిన వాళ్లు అడగడంతో.. ఇక దళితబంధు రాదేమోనని మనస్తాపం చెందిన అమల వి షం తాగింది.
గమనించిన అమల భర్త ప్రవీణ్ వెంటనే జమ్మికుంటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. రెండో విడత నిధులు వస్తే అప్పులు తీర్చేద్దామనుకున్నామని తెలిపాడు. ఇటు సీజన్ లేక రూమ్ కిరాయి కూడా ఎల్లడం లేదని, మరోవైపు అప్పులోళ్లకు ఇచ్చిన టైం దాటిపోవడంతో వారు ఇంటికి వస్తరేమోనన్న భయంతో తన భార్య అమల విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని వాపోయాడు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండో విడత డబ్బులు రిలీ జ్ చేయ్యాలని వేడుకున్నాడు. విషయం తెసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ దళితబంధు సంఘం నాయకులు అమలను పరామర్శించారు. ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.
అప్పులు తీర్చే దారిలేక..
ఇక.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి(చర్చి ఏరియా)కు చెందిన బొటికెల మొగిలి-సరోజనకు రాజేశ్, సుమన్, శ్రీనివాస్ ముగ్గురు కుమారులు. వీరు దళితబంధు పథకానికి ఎంపికయ్యారు. శ్రీనివాస్ డీజే యూనిట్ పెట్టుకున్నాడు. యూనియన్ బ్యాంకులో ఖాతా తీసిన శ్రీనివాస్కు 2022 జూలై 1న రూ.10 లక్షలు జమయ్యాయి. డీజే యూనిట్కు తొలి విడత కింద అదే నెల 25న రూ.5 లక్షలు వచ్చాయి. రెండో విడత వస్తాయని డీజే అదనపు పరికరాల కొనుగోలు కోసం రూ.లక్షా 90 వేలకు పైగా అప్పులు చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిధుల విడుదల ఆగిపోయింది. శ్రీనివాస్కు అప్పులోళ్ల ఒత్తిడి ఎక్కువైంది. సీజన్ లేకపోవడంతో డీజే సరిగా నడవడం లేదు. ఇటీవలే శ్రీనివాస్కు యాక్సిడెంట్ అయ్యి పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ మనస్తాపం చెంది గత నెల 28న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ప్రస్తుతం చల్మెడ ఆనందరావు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ను, కుటుంబ సభ్యులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. కరీంనగర్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశాల్లో తాను సంబంధిత ఇన్చార్జ్ మంత్రులకు ఈ విషయాన్ని విన్నవించినా పెడచెవిన పెట్టారని, దళితులు అప్పుల పాలవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటామని వాపోతున్నారని చెప్పినా మంత్రులు వినే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి లబ్ధిదారుకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి వెంట ఉండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను పరామర్శించేలా చూస్తానని చెప్పారు.