హనుమకొండ : బర్రెల కొనుగోలు కోసం గుజరాత్ వెళ్లిన దళితబంధు లబ్దిదారు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ గ్రామానికి చెందిన 8 మంది దళితబంధు లబ్దిదారులు.. బర్రెల కొనుగోలు కోసం గుజరాత్కు వెళ్లారు. ఈ ఎనిమిది మందిలో ఏడుగురు తిరిగి రాగా, సొరపాక సమ్మయ్య మాత్రం అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో సమ్మయ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
49 ఏండ్ల సమ్మయ్యకు తెలుగు భాష తప్ప ఇతర భాషలేవి రావు. దీంతో అతని కుటుంబ సభ్యులు కమలాపూర్ పోలీసులను ఆశ్రయించగా, తమ పరిధిలోకి రాదని వారు తేల్చిచెప్పారు. చేసేదేమీ లేక వరంగల్ రైల్వే పోలీసులను బాధితుడి కుటుంబ సభ్యులు సంప్రదించారు. సమ్మయ్య ఆచూకీ కనుగొనాలని వేడుకున్నాడు. గుజరాత్లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో సమ్మయ్య అదృశ్యమైనట్లు పోలీసులకు వారు తెలిపారు. సమ్మయ్య అదృశ్యాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ దృష్టికి తీసుకెళ్లారు. రైతు సమ్మయ్య ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.