ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 6: పెండింగ్లో ఉన్న పాల బిల్లులను తక్షణమే చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయ డెయిరీ ప్రధాన కార్యాలయం ఎదుట పాడి రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, తెలంగాణ విజయ డెయిరీ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఆందోళనకారులు డెయిరీ లోపలికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బయటే కూర్చుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పలువురు పాడి రైతులు సెక్యూరిటీని తోసుకుంటూ లోనికి వెళ్లి డెయిరీ ఎండీ చాంబర్లో బైఠాయించి, తమ సమస్యలు విన్నవించారు. పాల బిల్లులు యాభై రోజులుగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం లీటరుకు రూ.5 ఇన్సెంటివ్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాణా సబ్సిడీ సకాలంలో ఇవ్వక ప్రైవేటు వ్యక్తుల వద్ద దాణా కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. 20 రోజుల్లో పెండింగ్లో ఉన్న పూర్తి బిల్లులను చెల్లిస్తామని ఎండీ హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.