హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత 4 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోత ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో రోజువారీ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం రోజువారీ విద్యుత్తు వినియోగం 7 కోట్ల యూనిట్లుగా నమోదైంది. ఈ నెలాఖరు నాటికి ఇది 8 కోట్ల యూనిట్లు దాటొచ్చని అంచనా. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో అత్యధిక విద్యుత్తు వినియోగం గ్రేటర్ హైదరాబాద్లోనే జరుగుతున్నదని అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో గృహ, వ్యాపార, వాణిజ్య అవసరాల విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిందని వివరించారు. హైదరాబాద్ పరిధిలో ప్రతి నెలా కొత్తగా దాదాపు 37 వేల విద్యుత్తు కనెక్షన్లు వస్తుండటంతో తదనుగుణంగా సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు అవసరమైన చోట అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మున్ముందు డిమాండ్ ఎంత పెరిగినా అందుకు సరిపడా విద్యుత్తు అందుబాటులో ఉన్నదని ఆయన పేర్కొన్నారు.