Cyber Crime | నిజామాబాద్ క్రైం, జనవరి 10: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కేశారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ప్రజాపాలన’లో డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన లావణ్య దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు ఈ నెల 3న గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి.. ‘ప్రజాపాలనలో మీరు చేసుకున్న దరఖాస్తును పరిశీలిస్తున్నాం.
రేషన్కార్డులో తప్పులు ఉన్నాయి. వాటిని సరిచేయాలంటే మీ ఫోన్కు ఓటీపీ పంపిస్తున్నాం. అది చెప్పాలి’ అని సూచించింది. ఇది నిజమేనని నమ్మిన లావణ్య ఓటీపీ చెప్పగానే.. డిచ్పల్లి ఎస్బీఐలో గల ఆమె ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా చేసినట్టు మెస్సేజ్ వచ్చింది. మోసపోయానని గుర్తించి బాధిత మహిళ హుటాహుటిన బ్యాంకుకు వెళ్లి ఖాతాలో ఉన్న మిగతా డబ్బును డ్రా చేసుకున్నది. ఇదే తరహాలో నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్కు చెందిన మరో మహిళకు అదే రోజు ఓ అపరిచితురాలు మూడుసార్లు కాల్ చేసింది.
మొదటిసారి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. ‘ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నారు కదా.. మీ వివరాలు చెప్పండి’ అంటూ మాటల్లో పెట్టేందుకు యత్నించింది. సైబర్ నేరాలపై కొంత అవగాహన ఉన్న సదరు మహిళ ఫోన్ కట్ చేసింది. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ కాల్ చేయగా కట్ చేసింది. మూడోసారి కూడా ఫోన్ రావడంతో సదరు మహిళ గట్టిగా నిలదీసింది. ‘అసలు ఎవరు మీరు.. ఎందుకు వివరాలు అడుగుతున్నారు’అని ప్రశ్నించడంతో అటువైపు నుంచి కాల్ కట్ అయింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బులు కాజేసేందుకు సైబర్ మోసగాళ్లు పక్కా ప్లాన్ వేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90 శాతం మంది మహిళలు ఉండటంతో వారిని సులువుగా మోసం చేయొచ్చనే ఉద్దేశంతో మహిళలను రంగంలోకి దింపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోయిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దరఖాస్తుదారులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరు అడిగినా ఓటీపీ చెప్పవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.