Cyber Crime | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ‘హలో మిస్టర్.. వై డిడెన్ట్ యూ ఆన్సర్ మై కాల్స్? ఎప్పట్నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిన్నారా? కాసేపు చాటింగ్ చెయ్యొచ్చు కదా?’ అంటూ తెలిసిన వారిలా గుర్తు తెలియని నంబర్ల నుంచి ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్ల నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఎంపిక చేసుకున్న కొన్ని ఫోన్ నంబర్లకు ర్యాండమ్గా మెసేజ్లు పంపుతున్నారు. అంద మైన అమ్మాయిల్లా అర్ధనగ్న ఫొటోలతో సెక్సీ డీపీలు పెట్టి ఉద్యోగం, బిజినెస్ పేరుతో చాటింగ్ ప్రారంభిస్తున్నారు. ఆపై గిఫ్ట్కార్డులు కొంటే బ్యాంకు ఖాతాలో రెట్టింపు డబ్బులు జమ అవుతాయని, యూట్యూబ్లో వీడియోలు చూసి కామెంట్లు, రివ్యూలు రాయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ముగ్గులోకి దింపుతున్నారు. ఒక్కో కామెంట్కు రూ.50 చొప్పున డబ్బులిస్తామని నమ్మబలుకుతూ రివ్యూ రాయాల్సిన లింకులను పంపుతున్నారు.
ఆ లింకులు నిజమేనని నమ్మి ఓపెన్ చేస్తే.. మెల్లగా టార్గెట్లు ఇస్తున్నారు. రూ.1,000 పెట్టుబడి పెడితే రూ.3 వేల లాభం వస్తుందని చెప్తున్నారు. ఆ టార్గెట్లను పూర్తి చేయగానే ఆన్లైన్లో ప్రత్యేక అకౌంట్ను ఓపెన్ చేసి, వచ్చిన డబ్బులన్నీ అందులో జమ చేస్తున్నారు. ఆ సొమ్మును విత్డ్రా చేసుకోవాలంటే కొత్త టార్గెట్లు పూర్తి చేయాలని షరతులు విధిస్తూ రూ.లక్షలు వసూలు చేసి దారుణంగా మోసగిస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారు పంపే మెసేజ్లకు స్పందించవద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 ఫోన్ నంబర్ను సంప్రదించాలని, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని సూచిస్తున్నారు.