హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సైబర్ క్రైం మోసాలు భారీగా పెరిగాయి. సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ల చేతుల్లో అమాయకులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 30న సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేకంగా ‘తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేసింది. 2022లో సుమారు 50 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు కాగా.. ఈ ఏడాది 85,030 ఫిర్యాదులు అందాయి.
వీటిల్లో ఆర్థికపరమైన సైబర్ క్రైమ్స్ 65,877 ఉండగా, ఇతర ఫిర్యాదులు 19,153 ఉన్నాయి. అయితే, 1930కు వచ్చిన ఫిర్యాదుల నుంచి తెలంగాణ పోలీసులు 12,317 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ మొత్తం ఫిర్యాదుల్లో రూ.707,25,75,547 నగదు సైబర్ మోసగాళ్ల అకౌంట్లకు చేరగా, రూ.114.72 కోట్ల నగదును పోలీసులు హోల్డ్ చేయగలిగారు. వీటిల్లో నిజమైన బాధితులను గుర్తించి రూ.7.29 కోట్ల నగదును అప్పగించారు. 149 కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. అనుమానాస్పద లావాదేవీల్లో 28,610 సిమ్కార్డులను బ్లాక్ చేశారు. సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.