Spurious Seed | హైదరాబాద్ : ఒక సగటు రైతుకు అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడో, వడగళ్లు పడ్డప్పుడో, కరువు వచ్చినప్పుడో కాదు.. ఒక రైతుకు నకిలీ విత్తనాలే ప్రధాన సమస్య అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. కరువు వచ్చినప్పుడో, వడగండ్లు పడ్డప్పుడో రైతు 50 శాతం పంట మాత్రమే నష్టపోతాడు.. కానీ నకిలీ విత్తనం మొత్తం రైతును, రైతు కష్టాన్ని తుడిచిపెట్టేస్తుందని ఆయన అన్నారు.
తయారీదారు నుండి ఊర్లలో దుకాణదారు వరకు నకిలీ విత్తనాలనేది పెద్ద మాఫియా.. వీళ్ళ లాభం రైతు ప్రాణం విలువ అని పేర్కొన్నారు. ఈ చైన్ను తెగ్గొట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో మూలంలోనే ఈ సమస్యను నరికేయాలని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ మా పోలీస్ శాఖను హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మేము నకిలీ విత్తనదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం అని సీపీ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగానే మన తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం నుంచి 90 శాతం వరకు నకిలీ విత్తనాల బెడద తగ్గిందని సీపీ తెలిపారు. ఇంకా అక్కడక్కడా ఈ మాఫియా ఉందన్నారు. వారినీ ఏరిపారేస్తాం. సీఎం నిత్యం రైతుల పట్ల, వారి క్షేమం పట్ల ఉండే ఆలోచనా దృక్పథంతో, రైతు భద్రతే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా పోలీస్ శాఖ కానీ రైతుల రక్షణకు ఎల్లపుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా నకిలీ విత్తనాల మాఫియాపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నాం. వ్యవసాయ శాఖ, వ్యవసాయ వర్సిటీతో మా పోలీస్ శాఖ సమన్వయం చేసుకొని ఈ నకిలీ విత్తనాల మాఫియా పట్ల అత్యంత కఠినచర్యలతో ఉక్కుపాదంతో అణచివేస్తాం అని సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.