పరిగి, జూలై 6 :గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లె ప్రకృతివనంలో నాటిన ప్రతి మొక్క సంరక్షించబడాలని సూచించారు. నీటికి ఇబ్బంది ఉందని, బోరు వేయించాలని కలెక్టర్ను సర్పంచ్ ఫాహీసుల్తానా కోరగా సానుకూలంగా స్పందించారు. ఎస్సీ కాలనీలో చిన్నారులతో కలిసి మొక్క నాటారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు అందజేయడంతోపాటు వాటిని నాటేలా చూడాలన్నారు.
గ్రామంలో పూడుకుపోయిన మురికికాలువల్లో వెంటనే సిల్ట్, రాళ్లు తొలగించి వాడుకలోకి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు. ఎస్పీ కాలనీలో మురికికాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. పనులు వేగంగా నడుస్తున్నట్లు సర్పంచ్ను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలంలో పెంచుతున్న టేకు మొక్కలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అభినందించారు. రైతులు తమ పొలాల గట్లపై.. నీడ తక్కువగా ఉండే టేకు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో దయానంద్, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ సుబ్రహ్మణ్యం, ట్రాన్స్కో ఏఈ ఎస్ఏకే ఖాన్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్కుమార్ పాల్గొన్నారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు
ధారూరు, జూలై 6 : గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామం పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. మంగళవారం అవుసుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను సంరక్షించాలని గ్రామ ఉపసర్పంచ్ సుదర్శన్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి తిరుపతిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో రోడ్లపై చెత్త వేయరాదని ప్రజలకు సూచించారు. పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్కు సూచించారు.