OTT | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఓటీటీలు, ఇతర ప్లాట్ఫాంలపై వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు రివ్యూలు, లైక్లు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని అమాయకులను సైబర్ దొంగలు నిండా ముంచుతున్నారు.
ఈ తరహా సైబర్ నేరాల బారిన పడి హైదరాబాదీ వాసులు దాదాపు అరకోటికి పైగా పోగొట్టుకున్నారు. సైబర్ దొంగలు ముందుగా.. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి, ప్రతి రోజు పూర్తి చేసిన టాస్క్లు, కమీషన్ డబ్బులు చూసుకోవచ్చని ఆకర్షిస్తున్నారు. ట్రాప్ చేసి వెంటనే మరో మాధ్యమంలోకి రావాలని లింక్ పంపి, అక్కడ ఇంకా ఎక్కువగా లాభం పొందవచ్చని మాయ చేస్తున్నారు. ముందు కొంత డబ్బు డిపాజిట్ చేస్తే, తర్వాత కమీషన్తో పాటు మొత్తం తిరిగి డిపాజిట్ చేస్తామని నమ్మించి డబ్బు కొల్లగొడుతున్నారు. ఇలా మోసపోయిన వారు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.