హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మారుతున్న నేర సరళి, తెరపైకి వస్తున్న సరికొత్త నేరాలను కట్టడి చేసేలా పోలీస్ వ్యవస్థలోనూ సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో శాంతిభద్రతల అంశంపై దాదాపు గంటన్నరకుపైగా చర్చ జరిగిందని తెలిసింది. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా నేరాల కట్టడికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా నేరాలకు సంబంధించిన పలు గణాంకాలను పోలీస్ ఉన్నతాధికారులు క్యాబినెట్కు వివరించినట్టు తెలసింది. తెలంగాణలో గత ఎనిమిది ఏండ్లుగా తీసుకుంటున్న పటిష్ఠ చర్యలతో దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్ తదితర నేరాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, అదే సమయంలో సైబర్ నేరగాళ్ల, ఆర్థిక మోసగాళ్ల బెడద ప్రజలకు పెరిగిందని అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. మారుతున్న నేర విధానాలను అరికట్టేలా పోలీస్ సిబ్బంది శిక్షణ, క్షేత్రస్థాయి విధుల్లో అనుసరించాల్సిన విధానాలు, ప్రాసిక్యూషన్ విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, శిక్షలు పెరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం పలు కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. సమగ్ర మార్పులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను క్యాబినెట్ ఆదేశించినట్టు తెలిసింది.
రాష్ట్ర సెక్రటేరియట్తోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లోని విభాగాధిపతి కార్యాలయాలు మొదలు కింది స్థాయి వరకు అన్ని క్యాటగిరీల్లోని ఉద్యోగుల పనితీరులో కీలక మార్పులు తెచ్చేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపైనా మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగిన ట్టు తెలిసింది. రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్త చేరే ఉద్యోగులకు మరింత స్పష్టత ఇచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.