హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): లాటరీలు, మ్యాట్రిమోనీలు పక్కన పెట్టి సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈఎంఐలపై పడ్డారు. ఇల్లు, వాహన లోన్లు తీసుకొన్న వారి డాటా సేకరించి మెసేజ్లు పంపుతున్నారు. మీ లోన్ డబ్బులు చెల్లించే ఖాతా నంబర్ మారిందని సదరు ఫైనాన్స్ కంపెనీలు, సంస్థలు, బ్యాంకుల పేరిట మెసేజ్లు, ఈ మెయిల్స్ పంపుతున్నారు.
అసలు బ్యాంకు ఖాతాల స్థానంలో సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతా నంబర్లు పంపుతున్నారు. అవి నిజమేనని వాటిని నమ్మి మోసపోతున్నవారు పెరుగుతున్నారు. ఇదే తరహాలో తమ ఫైనాన్స్ కిస్తీలు సైబర్ నేరగాళ్లు కట్టించుకుంటున్నారని టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధులు రెండు రోజుల క్రితం హైదరాబాద్లో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఎంఐ చెల్లింపు గురించి తమ కస్టమర్లకు ఫోన్లు చేస్తే.. అప్పటికే తాము చెల్లించామని చెప్పడంతో టాటా ఫైనాన్స్ సిబ్బంది ఆ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయడంతో కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేరుగా కంపెనీనే సంప్రదించాలి
ఈఎంఐ (నెలవారీ వాయిదాలు) చెల్లింపు విషయంలో అప్పటికే తెలిసిన ప్రతినిధులు కాకుండా కొత్తవారి నుంచి ఏవైనా ఫోన్లు వచ్చినట్టు గుర్తిస్తే వెంటనే సదరు కంపెనీ కార్యాలయానికి వ్యక్తిగతంగా వెళ్లి సరిచూసుకోవడం మంచిదని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. అవతలి వ్యక్తి ఫోన్లో చెప్పిన వెంటనే డబ్బులు చెల్లించకూడదని, వారికి మన బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర సమాచారం కూడా చెప్పవద్దని హెచ్చరిస్తున్నారు.
మనం ఆన్లైన్లో ఏ షాపింగ్ చేయకుండానే కొందరు డెలివరీ బాయ్స్లా వచ్చి మోసగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ‘ఆన్లైన్లో ఎటువంటి వస్తువు ఆర్డర్ చేయకుండానే ఎవరో ఒక వ్యక్తి మీ ఇంటికి డెలివరీ బాయ్లా వస్తాడు. తన చేతిలో ఉన్న చిన్న డబ్బా చూపిస్తూ మీ అడ్రస్కే ఈ పార్సిల్ వచ్చిందంటూ నమ్మబలుకుతాడు. మనం ఆ వస్తువు ఆర్డర్ చేయలేదని, కొరియర్ మాది కాదని చెబితే.. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను.. మీ మొబైల్ నంబర్ చెప్పండి.. అలాగే మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి.. అంటే అతడిని మోసగాడిగా గుర్తించాలి. మన వివరాలు ఏవీ చెప్పవద్దు’ అని సూచించారు.