Cyber Crime | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఏటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. వివిధ పద్ధతులు, పలు గ్రూపుల లింకుల ద్వారా బాధితులు కోట్లు పోగొట్టుకుంటున్నట్టు తెలిపారు. పలు నేరాల వివరాలను ఆమె వెల్లడించారు. వివిధ డిజిటల్ వేదికలపై ముఖ్యంగా ఐపీవోతో ముందస్తు కేటాయింపులు బాగా పెరుగుతాయని నమ్మించి పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేస్తున్న కేసులు అనేకం నమోదవుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాల్లో భాగంగా నిరుడు 627 కేసులు నమోదయ్యాయని, వాటి వల్ల రూ.3.9 కోట్ల వరకు దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 213 కేసులు నమోదు కావడంతోపాటు రూ.27.4 కోట్లను ప్రజలు నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు.
కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు
కూకట్పల్లికి చెందిన నగల వ్యాపారి ‘గోల్డ్మెన్ సాచెస్ బిజినెస్ స్కూల్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేరారు. పెట్టుబడులు పెట్టి రూ.5.98 కోట్లు పోగొట్టుకున్నారు. న్యూబోయినపల్లికి చెందిన వ్యాపారి ‘82 స్ట్రాంగ్ స్టాక్స్ అకాడమీ’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేరి, రూ.67.50 లక్షలు నష్టపోయారు. రాజేందర్నగర్కు చెందిన ‘ఎయిర్టెల్ రిలయన్స్ క్లబ్’, ‘బీ1 కేకేఆర్సీఏ స్టడీయిం గ్’ వంటి రెండు గ్రూపుల్లో చేరిన సీఏ చదివిన ఒక ప్రైవేటు ఉద్యోగి వాట్సాప్ గ్రూప్లో వచ్చిన లింకుతో రూ.50.61 లక్షలు నష్టపోయారు. కేపీహెచ్బీలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి స్టాక్ మార్కెట్ రీ సెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుతో వచ్చిన వాట్సాప్ గ్రూపు లో చేరి రూ.1.03 కోట్లు పోగొట్టుకున్నారు.
సెబీ మార్గదర్శకాలు పాటించాలి: పోలీసులు
ప్రజలు పెట్టుబడులు పెట్టే క్రమంలో సెబీ మార్గదర్శకాలను అనుసరించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. మోసపూరిత లింకులు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా వస్తున్నాయని, ఆ లింకుల ద్వారా ప్రేరేపితమైన మెసేజ్లను నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
గంటలోపే 1930కి కాల్ చేయండి
ఆన్లైన్ పెట్టుబడులకు ముందు బాగా ఆలోచించండి. బ్రోకర్తో పని చేసేముందు, వారి ట్రాక్ రికార్డ్ను తనిఖీ చేయాలి. డీమ్యాట్ ఖాతా తెరవకుండానే స్టాక్స్ ట్రేడ్ చేస్తే, మీరు డబ్బును కోల్పోవచ్చు. డీమ్యాట్ ఖాతా లేకుండా అనధికార యాప్లు, ఏపీకే ఫైల్స్, యాప్స్ ద్వారా వ్యాపారం చేయ డం ప్రమాదకరం. మోసానికి గురైన గంటలోపే 1930కి కాల్ చేసి, స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వండి.
– శిఖాగోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏడీజీ