వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు.
Cyber crime | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు పంథా మారుస్తున్నారు. గతంలో అమాయకులను బెదిరించి, అందినకాడికి దోచుకున్న ఆ కేటుగాళ్లు.. ఇప్పుడు ఉద్యోగులను, సాఫ్ట్వేర్ ఇంజినీర్లను టార్గెట్ చేస్తున్నారు. అధిక లాభాల పేరుతో బురిడీ కొట్టించి ఒకొక్కరితో ఎంత సాధ్యమైతే అంత భారీగా పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ డబ్బును వెంటనే క్రిప్టోలోకి మారుస్తున్నారు. ఆ పెట్టుబడికి భారీ లాభం వచ్చినట్టు చూపుతున్నారు. ఆ సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు కొత్త టార్గెట్లు విధిస్తున్నారు. ఆ టార్గెట్ల ద్వారా వచ్చిన పెట్టుబడులను కూడా 24 గంటల్లోపే క్రిప్టో అకౌంట్లలోకి మార్చి స్వాహా చేస్తున్నారు. అలా సందీప్ (పేరు మార్చాం) అనే ఓ వ్యక్తి కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.23 లక్షలు కోల్పోయి విలవిల్లాడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సందీప్.. తన సంపాదనలో సింహ భాగాన్ని వెచ్చించి ప్రముఖ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేవాడు. వాటి విలువ కూడా భారీగా పెరగడంతో తెలిసినవారంతా ఆయనను అదృష్టవంతుడు అనుకున్నారు. దీంతో పెట్టుబడులపై సందీప్కు క్రమంగా ఆసక్తి పెరిగింది. పదేండ్లలో ఇటు ఉద్యోగం, అటు షేర్ల ద్వారా వచ్చిన రాబడితో దాదాపు రూ.30 లక్షల వరకు వెనకేసుకున్నాడు. ప్రశాంతంగా ఖమ్మంలోని స్వగ్రామానికి వెళ్లి భూములు కొనుక్కుందామనుకున్నాడు.
ఇంతలో అతనికి తెలియకుండానే ‘టెలిగ్రామ్’ సామాజిక మాధ్యమంలో ఓ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గ్రూప్లో యాడ్ చేయబడ్డాడు. ఆ గ్రూప్లోని కొందరు సభ్యులు తమకు వచ్చిన లాభాలను స్క్రీన్షాట్లు తీసి పెట్టడంతో సందీప్ అత్యాశకు పోయి ఊబిలో దిగాడు. జూలై 29న రూ.5 వేలతో ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టాడు. గంటలోనే రూ.10 వేల లాభం రావడంతో మరో రూ.23,500 ఇన్వెస్ట్ చేశాడు. దానికి రూ.30 వేల వరకు లాభం వచ్చినట్టు స్క్రీన్పై కనిపించడంతో.. అదే రోజు రూ.61 వేలు, మరుసటి రోజు (జూలై 30న) మరో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తన పెట్టుబడికి రెట్టింపు నగదు స్క్రీన్పై కనిపించడంతో జూలై 31న ఏకంగా రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన లాభాన్ని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో తనతో పెట్టుబడి పెట్టించినవారి నంబర్కు కాల్ చేశాడు. వారు మరో రూ.లక్ష ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంతో సందీప్ ఆగస్టు 2న ఆ పెట్టుబడీ పెట్టిన సందీప్.. ఆరు రోజుల అనంతరం ఒకేసారి రూ.10 లక్షలు, ఈ నెల 21న మరో రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.23 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు వీల్లేకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన సందీప్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో మనం డబ్బులు చెల్లించడమే తప్ప విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా.. కేవలం రూ.5 వేలలోపే ఉంటుంది. ఆపైన మీరు ఎంతపెట్టినా మోసపోతున్నట్టే లెక్క. కనుక అధిక లాభాల కోసం ఎవరూ ఆశ పడకూడదు. ఆన్లైన్ వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్లకూడదు. సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలి. లేదంటే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలి.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్