హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన షీ టీమ్స్ విభాగం ‘సైబర్ అంబాసిడర్స్’గా గుర్తింపునిచ్చింది. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు ఈ గుర్తింపు దక్కింది. సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల పట్ల నేరాలపై ఈ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
తమ పాఠశాల, కమ్యూనిటీల్లో ఆ వివరాలను అందరికీ తెలియజేయడమే ‘సైబర్ అంబాసిడర్ల‘ బాధ్యత. బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలు భద్రంగా ఎలా ఉంచుకోవాలో వీరు వివరిస్తారు. షీటీమ్స్తోపాటు రాష్ట్ర స్యూల్ ఎడ్యుకేషన్ శాఖ, యంగిస్తాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 1650 పాఠశాలల నుంచి ఒక్కో స్కూల్లో ఇద్దరికి ఈ ‘సైబర్ కాప్-సైబర్ అంబాసిడర్’ గుర్తింపు బ్యాడ్జిలను అందజేయనున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో ఈ బ్యాడ్జి ప్రదాన కార్యక్రమం జరిగింది. మొత్తం 3,300 మంది విద్యార్థులకు సైబర్ భద్రతపై శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్లోని మెహబూబియా బాలిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్ర ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డీఐజీ సుమతి బడుగుల ఐపీఎస్ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.