మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. గురువారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 1986లో 75.6 అడుగుల వరద వచ్చినా ఇంత ముంపు లేదని, ప్రస్తుతం 71.4 అడుగుల వరద వస్తేనే ముంపు అధికంగా ఉన్నదన్నారు. పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కులకు సరిపడా నిర్మిస్తే భద్రాచలం పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తంచేశారు.
పోలవరాన్ని మూడు కొండల మధ్య నిర్మిస్తున్నారని, ఒకవైపు కాంక్రీట్ డ్యామ్, మరోవైపు కాఫర్ డ్యామ్ను నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వరద ఎక్కువ ఉండటంతో రెండు వైపులా కూడా డ్యామ్పై నుంచి వరద పోతున్నదని చెప్పారు. కాఫర్ డ్యామ్ ఉన్నచోట కాంక్రీట్ డ్యామ్ నిర్మిస్తే భద్రాచలం మొత్తం మునగడం ఖాయమన్నారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరం బ్యాక్వాటర్ అధ్యయనం కోసం కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ వేయాలని మంత్రి పువ్వాడ డిమాండ్చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్ ఉన్నారు.