హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ‘నా 32 ఏండ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాల జ్ఞాపకాలతో ప్రయాణం చేశా. అనేక కఠినమైన సవాళ్లు ఎదుర్కొన్నా..’ అని డీజీపీ శివధర్రెడ్డి చెప్పారు. గురువారం తన ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అకాడమీ, డీజీపీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో శివధర్రెడ్డి మాట్లాడారు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలిపారు.
1970, 1980 నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పోలీసింగ్లో చాలా తేడా వచ్చిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల నమ్మకాన్ని గెలిచామని, ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించినట్లు తెలిపారు. తాను ఎంతగానో ఇష్టపడే తన మాతృ రాష్ట్రానికి డీజీపీగా సేవలు అందించడం.. తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని భావోద్వేగానికి గురయ్యారు. డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. యువ పోలీసులు శాఖకు మంచిపేరు తేవాలని కోరారు. తెలంగాణకు మంచి చాలెంజింగ్ అధికారి సీవీ ఆనంద్ డీజీపీగా రాబోతున్నారని కొనియాడారు.
డీజీపీగా ఉద్యోగ విరమణ పొందుతున్న శివధర్రెడ్డిని తాను దగ్గరగా చూశానని, సమైక్య రాష్ట్రంలో ఆయన ఎన్నో సవాళ్లు అధిగమించారని కాబోయే డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ అకాడమీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో శివధర్రెడ్డి సేవలు అందించారని, ఎన్కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్లలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తెలంగాణలో విజయవంతం కావడంలో శివధర్రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందన్నారు. అనంతరం శివధర్రెడ్డిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై నిల్చోబెట్టి ఐపీఎస్ అధికారులు దానిని లాగుతూ ఆయనకు సగౌరవంగా వీడ్కోలు పలికారు.