హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పేదలు, కూలీలకు ఉపాధి అందిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏటా నిధులకు కోత పెడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో తెలంగాణ ఈజీఎస్ ఉద్యోగులతో కలిస్ మంత్రి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఆర్ధిక సంవత్సరం 2023-24కు బుధవారం పార్లమెంట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 89వేల కోట్ల నుంచి రూ. 60వేల కోట్లకు బడ్జెట్ తగ్గించడం శోచనీయమని పేర్కొన్నారు.
కేంద్రం ఉపాధి కూలీలకు పనిదినాలు పెంచకుండా, నిధులు ఇవ్వకుండా కూలీల పొట్టగొడుతోందని పేర్కొన్నారు. బడ్జెట్లో నిధుల తగ్గింపుతో కేంద్రం పేదలు, కూలీల వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రజోపయోగ పనులు చేసిందని తెలిపారు. దీనిని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రశంసించిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాల సంతోషం కోసం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల క్యాలెండర్ 2023 ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏ.లింగయ్య, కో చైర్మన్లు అంజిరెడ్డి, విజయ్ కుమార్, వెంకట్రామిరెడ్డి, మోహన్ రావు, తంగేళ్ల రఘు, జానగిరి, చరణ్ సింగ్, సుదర్శన్, టీసీవోస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.