హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.28.52 లక్షలు ఉంటుందని తెలిపారు. విమానాశ్రయంలోని ఏఏఆర్ ఫెసిలీటీ సర్వీస్ ప్రైవేటు ఉద్యోగి ద్వారా బంగారాన్ని తరలించేందుకు నిందితుడు ప్రయత్నించాడని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. గాజులు, బిస్కెట్లు, గొలుసుల రూపంలో బంగారాన్ని తీసుకొచ్చాడని చెప్పారు.
గురువారం కూడా ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికురాలి నుంచి 1.646 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం విలువ రూ.86 లక్షలు ఉంటుందని తెలిపారు. కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ప్రయాణికురాలిపై అధికారులకు అనుమానం వచ్చింది. దాంతో ఆమెను తనిఖీ చేయగా.. సాక్స్లలోని బ్లాక్కవర్లలో పేస్టు రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దాంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.