MGM | వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 30: వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మృతుడి కుటుంబసభ్యులు కూడా దీనిపైనే ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లెకు చెందిన బొజ్జ భిక్షపతి కాలేయ సంబంధ సమస్య (ఆల్కహాల్ లివర్ సిరోసిస్)తో నర్సంపేట ఏరియా దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు శుక్రవారం తెల్లవారుజామున ఎంజీఎం అత్యవసర విభాగంలో చేరాడు. వైద్యసేవలు ప్రారంభించిన వైద్యులు ఆర్ఐసీయూ విభాగంలో చేర్చి వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. చికిత్స కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి ఎంజీఎంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడి ఆర్ఐసీయూ విభాగానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో భిక్షపతికి అమర్చిన వెంటిలేటర్ పనిచేయకపోవడంతో శ్వాస సమస్య తీవ్రమై మృతిచెందినట్టు మృతుడి బంధువులు ఆరోపించారు.
ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడింది వాస్తమేనని, జనరేటర్ పనిచేస్తున్నప్పటికీ షార్ట్ సర్క్యూట్ కారణంగా సరఫరా జరగాల్సిన వైరింగ్ కాలిపోయిందని తెలిపారు. కానీ.. బాధితుడు మృతిచెందిన సమయంలో వెంటిలేటర్ బ్యాటరీ బ్యాకప్తో కొనసాగుతూనే ఉన్నదని వివరించారు. బాధితుడి మృతికి విద్యుత్తు అంతరాయం కారణం కాదని, వ్యాధి తీవ్రతతో అంతర్గత రక్తస్రావం జరిగి.. రక్తపు వాంతులు ఎక్కువై మృతి చెందాడని స్పష్టం చేశారు. అర్ధరాత్రి సమయానికి విద్యుత్తు పునరుద్ధరణ జరిగినట్టు తెలిపారు. ఎంజీఎం అత్యవసర విభాగంతోపాటు పలు విభాగాల్లో ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా విద్యుత్తు మరమ్మతులు చేపట్టనున్నట్టు వెల్లడించారు.