World Heritate Day | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురసరించుకొని హెరిటేజ్ తెలంగాణ శాఖ, ములుగు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘శిల్పం, వర్ణం, కృష్ణం – సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో వరల్డ్ హెరిటేజ్ డే మెగా వేడుకలను రామప్ప దేవాలయంలో నిర్వహిస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయం ( Ramappa Temple ) ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫుడ్ ఫెస్టివల్, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్, డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి, సింగర్ కార్తీక్, నవీన్తోపాటు 300 మంది కళాకారులు కలిసి నాట్య ప్రదర్శన, వాయిలిన్ షో, లేజర్ షో నిర్వహిస్తున్నట్టు సోమవారం వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అద్భుతమైన పురావస్తు, చారిత్రక సంపద, ప్రకృతి జలపాతాలు, అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను, తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో పరిరక్షిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ విశేష కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణ ప్రాంతంలోని చారిత్రక వారసత్వ సంపదపై నిర్లక్ష్యం వహిస్తే.. స్వరాష్ట్రంలో వాటికి సీఎం కేసీఆర్ ప్రాణం పోశారని వెల్లడించారు.