రాజన్న సిరిసిల్ల : గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని పోలీసలు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్కు చెందిన హైదర్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద సాగు చేస్తున్న దాదాపు 31 గంజాయి మొక్కలను పట్టుకున్నామని రూరల్ సీఐ సదన్ కుమార్ తెలిపారు.
రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామ చేసి ..గంజాయి మొక్కలను అక్కడి నుండి తరలించామన్నారు. గంజాయి, మత్తుకు బానిసై యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల రవాణా, వాడకం వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.