హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): యాసంగి సాగు ముగింపు దశకు చేరుకున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 52.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అత్యధికంగా వరి 35.84 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఆ తర్వాత శనగ 3.69 లక్షల ఎకరాలు, వేరుశనగ 3.46 లక్షల ఎకరాల్లో సాగైంది. గత యాసంగితో పోల్చితే ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం సుమారుగా 14 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో ఈ సమయం వరకు మొత్తం 66.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ సీజన్లో 52.88 లక్షల ఎకరాల్లో సాగైంది. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో తెలంగాణ నుంచి ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేయబోమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు వరి సాగు చేయొద్దని సూచించింది. దీంతో గతంతో పోల్చితే వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగిలో ఇప్పటివరకు 51.62 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా ఈ సీజన్లో మాత్రం 35.84 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గతంతో పోల్చితే ఏకంగా 15.78 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గడం గమనార్హం. ఈ ప్రభావం మొత్తం విస్తీర్ణం పెరుగుదలపై పడింది.
పప్పు, నూనె గింజల సాగు
మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పులు, నూనెగింజల సాగును ఎక్కువగా చేశారు. గత యాసంగిలో పప్పులు 4.51 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ సీజన్లో 5.17 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో శనగ పంట 3.48 లక్షల ఎకరాల నుంచి 3.69 లక్షల ఎకరాలకు పెరిగింది. మినుములు 47 వేల ఎకరాల నుంచి 87 వేల ఎకరాలకు పెరిగింది. నూనెగింజల సాగు గత యాసంగిలో 3.54 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ సీజన్లో 4.76 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే 1.22 లక్షల ఎకరాలు పెరగడం గమనార్హం. వేరుశనగ 2.72 లక్షల ఎకరాల నుంచి 3.46 లక్షల ఎకరాలకు పెరిగింది. పొద్దుతిరుగుడు కూడా 18 వేల ఎకరాల నుంచి 38 వేల ఎకరాలకు పెరిగింది.