హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు కులవృత్తులుగా ఉన్న కొన్నిరకాల జంతువుల పెంపకం ఇప్పుడు మనదేశంలో పరిశ్రమగా మారుతున్నది. అన్నివర్గాలవారు ఆయా పరిశ్రమల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాడిపశువులు, జీవాలు, పందుల పెంపకంపై ఇటీవలికాలంలో విద్యావంతులు కూడా దృష్టిసారిస్తున్నారు. సీమపందుల పెంపకం లాభసాటిగా మారటంతో చాలామంది వాటిని భారీస్థాయిలో పెంచేందుకు ముందుకొస్తున్నారు. అయితే, కొత్తగా సీమపందుల పెంపకం చేపట్టేవారు ఎలాంటి జాతులను ఎంచుకోవాలి? పోషణ, ఆరోగ్య పరిరక్షణలో జాగ్రతలపై పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మ తగిన సూచనలు చేశారు.
పౌష్టికాహార భద్రతకు..
కోళ్లు, మేకల తరహాలో సీమ పందుల పెంపకం ఎంతోమందికి ఉపాధినిస్తున్న పరిశ్రమ. తకువ కాలంలో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలిచ్చే పరిశ్రమగా దీనికి పేరుంది. పాశ్చాత్య జాతులైన లార్జ్ వైట్ యార్ షైర్, లాంగ్ రేస్ వంటి రకాలతో పాటు సంకరజాతి పందులు కూడా మన వాతావరణానికి అనుకూలం. ఒక్కో ఈతలో ఎకువ పిల్లలను పెట్ట టం వల్ల సంతాన వృద్ధి వేగంగా ఉంటుంది. 8 ఆడ సీమపందులు 2 మగవాటితో పెంపకం ప్రారంభిస్తే ఏడాదిలో వీటి సంఖ్య 150 దాటుతుంది. వీటి పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తకువ. పందుల్లో 60 నుంచి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది. వీటి కొవ్వును కోళ్ల దాణా, సబ్బుల తయారీ, రంగులు, రసాయనాల్లో వినియోగిస్తున్నారు. 7-8 నెలలకే వీటిని మారెట్ చేయవచ్చు.
మౌళిక వసతులు అవసరం..
వ్యాపారసరళిలో సీమ పందుల పెంపకాన్ని చేపట్టేవారు ముందుగా మౌలిక సదుపాయలపై దృష్టి పెట్టాలి. గాలి, వెలుతురు బాగా వున్న చోట షెడ్లు నిర్మించాలి. పుట్టిన పిల్లలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సీమపందుల పెంపకం ఖర్చులో ఎకువభాగం వాటి మేపుకే అవుతుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టి, దాణా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. పూర్తిగా దాణాపై ఆధారపడితే పెంపకం లాభసాటిగా వుండదు. మేపును బట్టి ఒకో సీమపంది రోజుకు 400-500గ్రాములు పెరుగుతుంది. 3కిలోల దాణాకు ఒక కిలో శరీర బరువు పెరుగుదల వుంటుంది. ఏడాదికి 130 సీమపందులపై రూ.3 లక్షలకు పైగా నికర లాభం పొందవచ్చు. ఆసక్తిగల రైతులు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పశువైద్య విశ్వవిద్యాలయంలో సంప్రదించవచ్చని సుష్మ సూచించారు.