న్యూఢిల్లీ, జూలై 19: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. అయోధ్య విరాళాల చోరీ, పేపర్ లీకేజీలు, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉన్నది. మరోవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. సమావేశాల చివరిలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఐదు కొత్తవి.. రెండు పెండింగ్ బిల్లులు..
ఈ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వందేమాతరం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐదు కొత్త బిల్లులు, రెండు పెండింగ్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు, 2026, సుప్రీం కోర్టు (జడ్జీల సంఖ్య) సవరణ బిల్లు, 2026, జనన, మరణ రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లు, 2026, జాతీయ గౌరవం (అవమానాల నిరోధం) సవరణ బిల్లు, 2026, ఎంఎస్ఎంఈ (సవరణ) బిల్లు, 2026 కొత్త బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. వీటితో రెండు పెండింగ్ బిల్లులు విదేశీ విరాళం (నియంత్రణ), వికాస్ భారత్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు, 2025ను కూడా ప్రవేశపెడతారు.
తగ్గిన విపక్ష బలం..
పరీక్ష పేపర్ల లీకేజీలు, హక్కుల కార్యకర్త సోనమ్ వాంగుచుక్ దీక్ష, అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్, విదేశీ పాలసీలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ సమావేశాలతో ఇప్పుడు జరగనున్న సమావేశాలను పోలిస్తే విపక్ష ఎంపీల బలం బాగా తగ్గింది. ప్రస్తుతం నాలుగు పార్టీలకు చెందిన కనీసం 37 మంది విపక్ష ఎంపీలు ఎన్డీఏ పక్షాన చేరారు. ఇది అధికార బీజేపీకి ఎంతో బలాన్ని చేకూర్చే అంశం. ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళల రిజర్వేషన్ను అమలు చేసే బిల్లును ఈ సమావేశాల్లో ఎన్డీఏ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ సమావేశాల్లో తగిన సంఖ్యాబలం లేక ఈ బిల్లును ఆమోదించుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అలాగని ఆదరాబాదరాగా ఈ బిల్లును ఈ సభలో ఆమోదించేందుకు అధికార పార్టీ తొందరపడటం లేదు. సమావేశాల తీరును పరిశీలించిన తర్వాత ఈ బిల్లు ప్రవేశపెడితే తమకు ఢోకా లేదన్న గట్టి విశ్వాసం ఏర్పడిన తర్వాతే దీనిని సమావేశాల మధ్యలో ప్రవేశపెట్టాలన్న యోచనలో కేంద్రం ఉంది.
నేడు రాజ్యసభలో ‘వందేమాతరం’ బిల్లు
జాతీయ గేయం వందేమాతర ఆలాపనకు ఎలాంటి ఆటంకాలు, అవమానాలు జరగకుండా, గీతాన్ని నిరోధించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటిరోజు సోమవారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడుతున్నారు. జాతీయ గౌరవ (సవరణ) బిల్లు, 2026ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెడుతున్నారు. దీంతో దీనిని సోమవారం నాటి రాజ్యసభ అజెండాలో చేర్చారు. ఈ చట్టం జాతీయ గీతానికి, జాతీయ జెండాకు, రాజ్యాంగానికి ఉన్నత స్థాయి హోదా ఏ విధంగా ఇస్తుందో, జాతీయ గేయానికి కూడా చట్టపరంగా అటువంటి హోదానే కల్పిస్తుంది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దేశ వ్యాప్తంగా వందేమాతరం 150వ వార్షిక వేడుకలు జరుపుకుంటున్న ఏడాదిలో కేంద్రం దీనిని ప్రవేశపెడుతున్నది.