సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ఏండ్లపల్లి గ్రామంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రెండోరోజు రైతు దినోత్సవాన్ని కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) రైతు బాంధవుడని కొనియాడారు. 2014 కు ముందు కేవలం 2,05,463 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందగా నేడు 5 ,82,464 ఎకరాలకు గోదావరి జలాలు(Godavari Water) పారుతున్నాయన్నారు. ధాన్యం దిగుబడి మూడింతలు పెరిగిందని చెప్పారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా వ్యవసాయానికి రూ. 10వేలు పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.
జిల్లాలో రైతుబంధు(Raitu bandu) పథకం కింద రూ. 2723 కోట్లు పెట్టుబడి అందించారని చెప్పారు. రైతు బీమా పథకంలో 3314 లబ్దిదారులకు రూ. 165.75 కోట్లు అంద జేసినట్లు వెల్లడించారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలో కరెంట్ ఉండదని ఆరోపించిన వారికి నేడు కరెంట్ పోనే పోదు అనే స్థితికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలోనే వందేళ్ల అభివృద్ధి తో పోటీ పడ్డామన్నారు. తెలంగాణ సమాజం మరింత అభివృద్ధి సాధించాలంటే 2014 కు ముందు,వెనుక పరిస్థితులను ఆత్మవలోకనం చేసుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.
ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శన
21 రోజుల పాటు రోజుకో శాఖపై నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. వేడుకల రెండోరోజు రైతు దినోత్సవం నిర్వహించగా గ్రామాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శన పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ ప్రదర్శన ముందు కోలాటం, భజన బృందాలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఎడ్లబండి తొలి రైతుదినోత్సవంలో పాల్గొన్నారు.