డిండి, ఆగస్టు 23 : పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా డిండిలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకొని పంటల ఉత్పత్తిని పెంపొందించుకోవాలని సూచించారు. మారుతున్న ఆహారపు అవసరాలకు అనుగుణంగా విభిన్న, వైవిధ్య పంటలు పండించాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైతులు పంటలు పండించేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు.
కూలీల కొరత తీర్చేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు రూ.58 వేల కోట్ల రైతుబంధు, రైతుబీమాకు రూ.7 వేల కోట్లు, పంటల కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. తెలంగాణలో మొత్తం భూమి ఎంత? ఏ పంటకు ఎందరు కూలీలు అవసరం? ఎన్ని రకాల యంత్రా లు అవసరం, ఏ పంటకు ఏ రకమైన యంత్రాలు అవసరం? అనేది ప్రాజెక్టు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.