హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల వరద నష్టం నివారణ చర్యలు, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం న్యూఢిల్లీ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్ని శాఖల అధికారులు సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున, జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సహాయ పునరావాస శిబిరాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిందని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆ శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగొద్దు
విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు, భవనాలు, విద్యుత్తు, రెవెన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, పోలీస్శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్, మున్సిపల్శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ జైన్, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు పాల్గొన్నారు.