హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు ఉన్నా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. వానలు, వరదలతో ఎక్కడా భారీ నష్టాలు జరుగలేదని స్పష్టం చేశారు. గోదావరి నది పరీవాహక జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాల్లో అప్రమత్తంపై ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వరదలతో చిక్కుకున్న వందలాది మందిని కాపాడినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 మందిని రక్షించాయని, మరో ఇద్దరిని వైమానికదళం రక్షించిందని సీఎస్ సోమేశ్ చెప్పారు. రాష్ట్రంలో 233 ప్రత్యేక శిబిరాల్లో 19,071 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాల్లో 6,318 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. ములుగు జిల్లాలో 4,049 మందికి, భూపాపల్లి జిల్లాలో 20 శిబిరాల్లో 1,226 మందికి ఆశ్రయం కల్పించినట్లు సీఎస్ వివరించారు.