హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై శనివారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వజ్రోత్సవాలపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందని సీఎస్ గుర్తుచేశారు.
ఆగస్టు 8న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశ సమైక్యత, దేశ భక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలను సిద్ధం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సమాచార, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్ బీ రాజమౌళి, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.