CS Santhi Kumari | నిర్మల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ‘నాడు ఏప్రిల్ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల్లో చిన్నచిన్న చెలిమెలు తీసి నీళ్లు ఊరితేనే ప్రజల గొంతు తడిసేది.. అవి కూడా పావుగంటపాటుకు పైగా లైన్లో ఉండి పట్టుకునేవారు. మహిళలు, చిన్నపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడేది. నేడు మిషన్ భగీరథలో ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయి.. ఇప్పుడు నాకు కడుపు నిండినంతా సంతోషం కలుగుతున్నది.’ అంటూ ఆదిలాబాద్ జిల్లా తొలి మహిళా కలెక్టర్, ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఆనందం వ్యక్తం చేశారు. నిర్మల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె గత అనుభవాలను పంచుకున్నారు.
వానకాలంలో సీజనల్ రోగాలతో ప్రజల ప్రాణాలు కూడా పోయాయని ఆవేదన చెందారు. నాడు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు పర్యటించాల్సి వస్తే వెంట మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకొని తిరిగేదని, గతంలో పోలీసుల రక్షణ ఉంటే తప్పా పర్యటించలేని పరిస్థితి ఉండేదని తెలిపారు. రెండు మండలాలకు కూడా పీహెచ్సీ ఉండేది కాదని, కలెక్టర్ బంగ్లాలో జనరేటర్ ఉంటే తప్ప ముందుకెళ్లే పరిస్థితి లేకుండేదని ఆనాటి దుస్థితిని గుర్తుచేసుకున్నారు.