హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయని, వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులు, పదోతరగతి పరీక్షల నిర్వహణ తీరుపై ఆమె సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను నిర్విరామంగా కొనసాగించాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని చెప్పారు. అనంతరం ఆమె పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం పట్ల కలెక్టర్లు, అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ దేవసేన, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.