Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడటం, తెగిపోకుండా ఉండేందుకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే కాజ్-వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పీఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యల కోసం అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు మ్యాన్హోళ్లపై కప్పులు తెరవకుండా నగరవాసులను చైతన్యపరచాలన్నారు.