Telangana Decade Celebrations | తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలపై సీఎస్ శాంతికుమారి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్తో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దశాబ్ధి ఉత్సవాలను అత్యంత వైభవంగా, పండుగ వాతావరణం నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, సచివాలయ, జీహెచ్ఎంసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున సచివాలయంలోకి ఎంట్రీ, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. సెర్మోనియల్ పరేడ్ నిర్వహణ, జాతీయ పతాకావిష్కరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున షామియానాలు, సీటింగ్, తదితర ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
సెక్రెటేరియట్తో రాజ్భవన్, అసెంబ్లీ ఇతర ప్రముఖ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని కోరారు.
జీహెచ్ఎంసీ సమన్వయంతో గన్పార్క్లోని అమరవీరుల స్థూపాన్ని పూలతో అలంకరించాలని సూచించారు. సమావేశ ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, పీఏ సిస్టమ్తో పాటు తదితర ఏర్పాట్లను చేపట్టాలని పౌర సంబంధాల స్పెషల్ కమిషన్ను ఆదేశించారు. చార్మినార్, క్లాక్ టవర్ తదితర చారిత్రక కట్టడాలను ఉత్సవాలు జరిగే రోజుల్లో విద్యుద్దీపాలతో అలంకరించాలని మున్సిపల్ శాఖకు సూచించారు.
ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సంబంధిత శాఖలు నోడల్ అధికారులను నియమించాలన్నారు. సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, శ్రీనివాస రాజు, సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, జైళ్ల శాఖ డీజీ , జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డి పాల్గొన్నారు.