హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 1266 మంది కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్లను జూనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ ఇటీవలే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సంక్షేమ పథకాల పురోగతిని సీఎస్ సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తెలంగాణకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటడం, గొర్రెల పంపిణీ, బీసీ, మైనారిటీలకు ఆర్థిక సాయం, గృహలక్ష్మి, దళితబంధు, భూమి పట్టాల పంపిణీ, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్ధీకరణ, వీఆర్వోల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సమీక్ష జరిగింది.
నెలన్నరలో హరితహారం లక్ష్యం
తెలంగాణకు హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ నెలన్నరలోగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయడంతోపాటు 85 శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా కోటి మొక్కలను ఒకే రోజు నాటేందుకు అవసరమైన స్థలాల ఎంపిక, కందకాల తవ్వకం పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని నిర్దేశించారు. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 84 విడుదలైందని ఇందుకు వెంటనే దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. జీవో 59 కింద ఇప్పటికే నోటీసులు అందుకున్నవారి నుంచి రెగ్యులరైజ్కు సంబంధించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ అదర్సిన్హా, పీసీసీఎఫ్ డోబ్రియాల్, ముఖ్యకార్యదర్శులు నవీన్మిట్టల్, బుర్రా వెంకటేశం, సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.