హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన చోటు ఇదేనని, దానికి గుర్తుగా ఈ స్థానంలోనే అమరజ్యోతిని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ జ్యోతి అమరుల త్యాగాలకు స్ఫూర్తి అని వెల్లడించారు. అమరజ్యోతిని ఆవిష్కరించుకోవటం చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు.
అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయాలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని, సాధించుకున్న స్వరాష్ర్టాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. దుబాయి, జర్మనీ, అమెరికా వంటి ప్రపంచ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని మదించి ఈ స్మారక జ్యోతిని తీర్చిదిద్దినట్టు వివరించారు. ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత రాష్ట్రంగా తెలంగాణ పేరొందాలని ఆకాంక్షించారు.