హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది. గురువారం 65,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
టీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్లే భక్తులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక శీఘ్ర దర్శనం రూ.300 టికెట్లను కూడా బుక్ చేస్తున్నట్టు సంస్థ చైర్మన్ జాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రోజుకు 1,000 మంది భక్తులకు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. శుక్రవారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పిస్తామని వివరించారు. బస్సు టికెట్ రిజర్వేషన్తో పాటే శీఘ్ర దర్శనం టికెట్లు కూడా పొందవచ్చని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రయాణించేవారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పారు. www. tsrtconline.in వెబ్సైట్ లేదా అధీకృత డీలర్ల ద్వారా ఈ టికెట్లను కనీసం ఏడు రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు అనుమతి ఇచ్చిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.